Corona Vaccine: రెండు డోసులు ఒకేసారి ఇచ్చేశారంటున్న మహిళ... కొట్టిపారేసిన వైద్య సిబ్బంది!

  • రాజస్థాన్ లోని దౌసాలో ఘటన
  • వ్యాక్సిన్ కోసం వెళ్లిన మహిళ
  • ఒక వైపున వ్యాక్సిన్ వేయడానికి ప్రయత్నిస్తే రక్తస్రావం
  • మరోవైపున వ్యాక్సిన్ వేసిన సిబ్బంది
  • రెండు డోసులు వేశారని భర్తకు చెప్పిన మహిళ
Woman alleges health workers gave her two doses of corona vaccine in a single session

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కు నిర్దిష్ట ప్రోటోకాల్ ఉన్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు వేయాలి. అదే కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారికి 12 నుంచి 16 వారాల మ‌ధ్య రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రాజస్థాన్ లో వైద్య సిబ్బంది తనకు రెండు డోసులూ ఒకేసారి ఇచ్చేశారని ఓ మహిళ ఆరోపిస్తోంది.

రాజస్థాన్ లోని దౌసాలో 44 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లింది. వ్యాక్సినేషన్ అనంతరం ఇంటికి చేరుకోగా... ఆమెకు తీవ్రంగా జ్వరం రావడంతో భర్త చరణ్ శర్మ ఆరాతీశాడు. తనకు వైద్య సిబ్బంది రెండు డోసులు వేశారని ఆమె చరణ్ శర్మకు చెప్పింది. దాంతో ఆయన వైద్య సిబ్బందిని నిలదీయగా, వారు ఆ ఆరోపణలను అంగీకరించలేదు.

దీనిపై దౌసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ చౌదరి స్పందిస్తూ, మొదట ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, రక్తం రావడంతో, వైద్య సిబ్బంది మరో వైపున వ్యాక్సిన్ ఇచ్చారని, ఈ నేపథ్యంలోనే ఆమె రెండు డోసులు ఇచ్చారని భావిస్తోందని తెలిపారు.

ఓ వైద్య కళాశాల నిపుణులు స్పందిస్తూ, ఒకేసారి రెండు డోసులు తీసుకున్నా ఏమీ కాదని వెల్లడించారు. కాగా, ఆ మహిళలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడంతో దౌసా వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News