Bandi Sanjay: కేసీఆర్ స్పందించి ఉంటే జూడాలు సమ్మెకు దిగేవారు కాదు: బండి సంజయ్

  • జూడాలను పిలిచి చర్చించే ధైర్యం కూడా లేదా?
  • వైద్య సిబ్బందిని ఎందుకు భర్తీ చేయడం లేదు?
  • కరోనా కేసులు తగ్గాయంటూ తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు
Bandi Sanjay fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సరైన సమయంలో కేసీఆర్ స్పందించి ఉన్నట్టైతే... జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగేవారు కాదని అన్నారు. జూడాలను పిలిచి చర్చించే ధైర్యం కూడా కేసీఆర్ కు లేదా? అని ఎద్దేవా చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా పంజా విసురుతున్న వేళ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని... అయినా ఖాళీలను కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందిలో ఎంతమందికి నష్టపరిహారం చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా జూడాలు విధులు నిర్వహిస్తే వారి తరపున బీజేపీ పోరాడుతుందని చెప్పారు. ఆసుపత్రులను సందర్శించిన కేసీఆర్... ఏయే సమస్యలను గుర్తించారో మాత్రం చెప్పలేదని విమర్శించారు. సీఎం వస్తున్నారంటూ ఆసుపత్రుల్లో సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాట్లు చేశారని... అక్కడకు వెళ్లి కేసీఆర్ నటిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయంటూ తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News