లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చిన నటుడు నిఖిల్... అడ్డుకున్న పోలీసులు

Police stopped Tollwood Actor Nikhil for not having Epass
  • ఈ-పాస్ లేదంటూ అడ్డుకున్న పోలీసులు
  • కిమ్స్‌లో మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానన్నా అనుమతి నిరాకరణ  
  • ఉన్నతాధికారులకు ట్వీట్ చేయడంతో అనుమతి
ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలతో గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో కరోనా లాక్‌డౌన్‌ను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రోగికి మందులు ఇచ్చేందుకు నిఖిల్ కారులో బయలుదేరాడు. తార్నాక-సికింద్రాబాద్ మార్గంలోని చెక్‌పోస్టు వద్ద ఈ-పాస్ లేదంటూ పోలీసులు నిఖిల్‌ను అడ్డుకున్నారు.

కిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగికి మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానని, ఈ-పాస్ కోసం ప్రయత్నించినప్పటికీ సర్వర్ సమస్యల వల్ల లభించలేదని చెప్పాడు. ఈ-పాస్ కోసం తాను 9సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు. రోగికి మందులు ఇచ్చేందుకు వెళ్తున్నాను కాబట్టి మెడికల్ ఎమర్జెన్సీగా భావించి అనుమతిస్తారనే ఉద్దేశంతో బయలుదేరానని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో నిఖిల్ ట్విట్టర్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాడు. వెంటనే స్పందించిన పోలీసులు లొకేషన్ పంపితే అక్కడి పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో నిఖిల్ అలాగే చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అనుమతించారు.
Go Back to Shorts
Tollywood
Actor
Nikhil
KIMS
Lockdown
Hyderabad

More Telugu News