Etela Rajender: బిడ్డా గంగులా.. నీ కథ మొత్తం తెలుసు.. 2023 తర్వాత నీవు ఉండవు: ఈటల తీవ్ర హెచ్చరిక

  • నీలాంటి వారి బెదిరింపులకు నేను భయపడను
  • నేను సంస్కారాన్ని వదిలేస్తే మాడిమసైపోతారు
  • అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకో
Etela Rajender gives strong warning to Gangula Kamalakar

టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విమర్శలు ఎక్కుపెడుతున్న వారిలో మంత్రి గంగుల కమలాకర్ మొదటి వరుసలో ఉన్నారు. ఈటలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈరోజ మీడియాతో మాట్లాడుతూ గంగులకు ఈటల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'బిడ్డా గంగులా... అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో' అని వ్యాఖ్యానించారు.

కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని, జిల్లాను బొందలగడ్డగా మార్చావని ఈటల దుయ్యబట్టారు. పైరవీలు చేసుకుని మంత్రి అయిన చరిత్ర నీదని... నీలాంటి చరిత్ర తనది కాదని అన్నారు. నీలాంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత, సంస్కారం ఉండాలని అన్నారు. హుజూరాబాద్ ప్రజలను నువ్వు వేధిస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. ఈరోజు తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఒక్కరోజైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు.

నువ్వు ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టావో ఎవరికి తెలియదు? అని ఈటల అన్నారు. నీ కథ మొత్తం తనకు తెలుసని... సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని... 2023 తర్వాత నీవు ఉండవని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2006 ఎన్నికల్లో దివంగత రాజశేఖరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎందరో నేతలను కొన్నా... తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్నే గెలిపించారని అన్నారు. ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో అదే జరుగుతుందని చెప్పారు.

తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని... లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే... 54 వేల ఓట్ల మెజారిటీతో హుజూరాబాద్ ఆదుకుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని అన్నారు. తన ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పారు.

More Telugu News