Jagan: ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు: సీఎం జగన్

  • 'స్పందన'పై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
  • తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం
  • తామే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆవేదన
  • తమిళనాడు నుంచి ట్యాంకర్ ఆలస్యమైందని వెల్లడి
  • కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
 CM Jagan video conference on Spandana

ఏపీ సీఎం జగన్ 'స్పందన'పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ, కొవిడ్ కట్టడి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు అని, అటువంటి సంఘటనలకు కూడా తామే బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు.

కొవిడ్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని, ఈ నేపథ్యంలో కొన్ని బాధాకరమైన ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. "ఒక్కోసారి ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నష్టాలు జరుగుతున్నాయి. వాటికి కూడా మనమే బాధ్యత వహించకతప్పదు. ఇవాళ ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. నిన్న కూడా ఆరు ఖాళీ ట్యాంకర్లను ఒడిశా పంపి అక్కడ్నించి ఆక్సిజన్ నింపుకుని వెనక్కి తీసుకువస్తున్నాం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం" అని వివరణ ఇచ్చారు.

అయితే, కొందరు రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. వ్యాక్సిన్ల పరిస్థితిపై రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. డబ్బులు తీసుకుని వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరినా కంపెనీలు తీసుకోవట్లేదని వెల్లడించారు.

More Telugu News