China: త‌ప్పిన ముప్పు... హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డ చైనా రాకెట్ శకలాలు

  • భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే మండిపోయిన శ‌క‌లాలు
  • గ‌త నెల‌ ఏప్రిల్‌ 29న చైనా ప్ర‌యోగం
  • నియంత్రణ కోల్పోయి భూమి వైపున‌కు దూసుకొచ్చిన రాకెట్ శ‌క‌లాలు
China rocket debris disintegrates over Indian Ocean

పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి ఏప్రిల్‌ 29న కోర్ మాడ్యూల్ మోసుకెళ్లిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ అనంత‌రం నియంత్రణ కోల్పోయిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆ రాకెట్ శ‌క‌లాలు ఎక్కడ పడతాయో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది. చివ‌ర‌కు భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శ‌క‌లాలు మండిపోయాయి. ఈ రోజు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

రాకెట్ శ‌కలాలు  బహిరంగ సముద్ర ప్రాంతంలో రాకెట్ పడినట్లు సీఎంఎస్ఈ పేర్కొంది. అయితే, ఆ ప్రాంతం మాల్దీవులకు సమీపంలో ఉంద‌ని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ వెల్ల‌డించింది.

కాగా, రాకెట్ శ‌క‌లాలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే  మండిపోతాయ‌ని ఇప్ప‌టికే చైనా కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రాకెట్ శకలాలు ఎక్కడ ప‌డ‌తాయ‌న్న విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు కొన్ని రోజులుగా దృష్టిసారించారు.



More Telugu News