యువతిపై కత్తితో దాడి.. ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్య

young man attacked on young girl with knife
  • జగిత్యాల జిల్లాలో  ఘటన
  • ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికెళ్లి గొడవ
  • ప్రతిఘటించడంతో కత్తితో మెడపై కోసిన వైనం
  • కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కత్తితో మెడకోసుకున్న యువకుడు
తన ప్రేమను నిరాకరించిదన్న అక్కసుతో కత్తితో యువతిపై దాడిచేశాడో యువకుడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  మేడిపల్లి మండలం మన్నెగూడేనికి చెందిన కట్కం రాజ్‌కుమార్ అనే యువకుడు జాబితాపూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా వెంటపడుతున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన రాజ్‌కుమార్ నాలుగు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు ఫోన్ చేసి కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె స్పందించకపోవడంతో నిన్న ఆమె ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.

ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన యువతి ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడిచేశాడు. అప్రమత్తమైన యువతి కుటుంబ సభ్యులు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. దీంతో వెంటనే అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు తీవ్ర గాయాలైన యువతిని జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Jagityal
Love
Attack

More Telugu News