Coronavirus: కరోనా మూడో వేవ్‌ కూడా తప్పదు: కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు

  • ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్న విజయ్‌ రాఘవన్‌
  • వ్యాక్సిన్లను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందన్న నిపుణులు
  • ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి
  • లాక్‌డౌన్‌ అవసరమనుకుంటే చర్చిస్తామన్న వీకే పాల్‌
Third wave is inevitable says govt experts

ఇప్పటికే రెండో దశ కరోనాతో వణికిపోతున్న భారత్‌లో మూడో వేవ్‌ కూడా తప్పదని కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం వెల్లడించింది. వైరస్ పరిణామ క్రమం ఇలాగే కొనసాగితే థర్డ్‌ వేవ్‌ ను ఎదుర్కోవడం అనివార్యమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్‌ రాఘవన్‌ స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిపుణుల బృందం మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు. కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్లను అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బెంగాల్‌, రాజస్థాన్‌, బీహార్‌ లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. బెంగళూరు, చెన్నై, కోజికోడ్‌, ఎర్నాకుళం, గురుగ్రామ్‌ వంటి ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, హర్యానాలో మరణాలు సైతం పెరుగుతున్నాయన్నారు.

మరోపక్క, దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తున్న నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పందించారు. కరోనా కట్టడికి ఇంకా ఏమైనా అదనపు చర్యలు చేపట్టాల్సి ఉంటే ప్రభుత్వం తప్పకుండా వాటిపై ఆలోచన చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు కరోనా కట్టడి మార్గదర్శకాలు జారీ చేశామని పేర్కొన్నారు.

More Telugu News