ప్రయాణాలకు ససేమిరా అంటున్న ఎయిరిండియా పైలెట్లు... వ్యాక్సిన్ కోసం డిమాండ్!
- ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎయిరిండియా పైలెట్లు
- ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేయలేమని స్పష్టీకరణ
- ఎయిరిండియా యాజమాన్యానికి లేఖ
కరోనా వ్యాప్తి మొదలయ్యాక గత ఏడాది కాలంలో పెద్ద సంఖ్యలో ఎయిరిండియా సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. వారిలో కొందరు మరణించారు. ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) స్పందిస్తూ... పైలెట్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల పాలవకుండా తప్పించుకోవాలంటే వైరస్ బారిన పడకుండా ఉండడం ఒక్కటే మార్గమని పేర్కొంది. అందుకే ప్రయాణాలు చేయలేమని ఐసీపీఏ ప్రతినిధులు ఎయిరిండియా మేనేజ్ మెంట్ కు తెలిపారు.
ఎలాంటి ఆరోగ్యపరమైన మద్దతు లేకుండా, బీమా సౌకర్యం లేకుండా, ఓవైపు భారీగా వేతనాల్లో కోత ఎదుర్కొంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విమానాలు నడిపేంత పరిస్థితుల్లో తాము లేమని వారు స్పష్టం చేశారు. తమ పరిస్థితికి వ్యాక్సినేషన్ పరిష్కారం అని భావిస్తున్నామని ఎయిరిండియా యాజమాన్యానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.