Assam: బెంగాల్ దీదీ వశం.. తమిళనాడు స్టాలిన్‌ కైవసం.. కేరళ విజయన్‌ సొంతం.. అసోంలో మోదీ హవా.. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి

  • దాదాపు ఖరారైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • బెంగాల్‌లో అంచనాలకు మించి రాణించిన తృణమూల్‌
  • తొలిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్న డీఎంకే స్టాలిన్‌
  • కేరళలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన విజయన్‌
  • అసోంలో పట్టు నిలుపుకొన్న కమలనాథులు
  • పుదుచ్చేరిలో అధికారానికి ఒక సీటు దూరంలో బీజేపీ
Four states and 1 UT Election results have concluded

హోరాహోరీగా సాగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పాటు కొన్ని రాష్ట్రాల్లోని విధానసభ, లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు దాదాపు ఖరారయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోబోయేదెవరో తేలిపోయింది.

బెంగాల్ దీదీ వశం..

యావత్తు దేశ దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. బొటాబొటి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. బీజేపీపై తృణమూల్‌ సంపూర్ణ ఆధిక్యం సాధించింది. అయితే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం పార్టీ వర్గాలను కాస్త నిరాశపరిచింది. మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు జరిగిన బెంగాల్లో‌ టీఎంసీ 213 స్థానాల్లో గెలుపొంది బీజేపీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 147 మార్క్‌ను సునాయాసంగా చేరుకుంది. ఇక బీజేపీ 75 స్థానాల్లో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. లెఫ్ట్‌ పార్టీలు ఒక స్థానంలో, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

తమిళనాడు స్టాలిన్‌ కైవసం..

ఇక తమిళనాడు విషయానికి వస్తే.. కరుణానిధి వారసుడిగా డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ తన సత్తాను చాటారు. అధికార అన్నాడీఎంకేను ఖంగు తినిపించారు. ఇప్పటి వరకు మొత్తం 147 స్థానాల్లో గెలుపొందిన డీఎంకే కూటమి మరో 13 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.  అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన 118 మ్యాజిక్‌ ఫిగర్‌ను డీఎంకే కూటమి ఎప్పుడో చేరుకుంది. ఇక్కడ కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం అంచనాలను అందుకోలేకపోయింది. పైగా పార్టీ అధినేతే ఓటమి చవిచూడడం గమనార్హం.

అసోంలో బీజేపీకి రెండోసారి ఛాన్స్‌.. 

అసోంలో అధికార బీజేపీ మరోసారి సత్తాను చాటింది. ఇక్కడ పోటీ రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే కొనసాగింది. చివరకు బీజేపీ 75 స్థానాల్లో, కాంగ్రెస్‌ కూటమి 50 సీట్లలో గెలుపొందాయి. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. బీజేపీ సీనియర్‌ నేత శర్బానంద సోనోవాల్‌ మరోసారి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

కేరళ విజయన్‌ సొంతం..

దేవభూమిగా పిలిచే కేరళలో లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి విజయ ఢంకా మోగించింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. కూటమి గెలుపులో సీఎం విజయన్‌ అన్నీ తానై వ్యవహరించారు. ఎల్‌డీఎఫ్‌ 99 స్థానాల్లో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలిచిన కమలనాథులు ఈసారి కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.

పుదుచ్చేరిలో బీజేపీ కూటమి

ఇక ఎన్నికలు జరిగిన ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 15 స్థానాల్లో గెలుపొందింది.  కాంగ్రెస్‌ 8 స్థానాల్లో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇతరులు ఐదు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్‌ మార్కుకు బీజేపీ ఒక సీటు దూరంలో ఉంది. ఇతరులతో కలిసి బీజేపీయే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

More Telugu News