RCB: బ్యాటింగ్, బౌలింగులో రాణించిన పంజాబ్.. బెంగళూరుకు మరో ఓటమి

  • రాహుల్, గేల్ మెరుపులు
  • బెంగళూరును వణికించిన స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్
  • మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ సేన
Bengaluru team bite earth in punjab hands

వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును అపజయాలు వెక్కిరిస్తున్నాయి. వరుస విజయాలతో తొలుత పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లిన కోహ్లీ సేన రెండు పరాజయాలతో మూడో ప్లేస్‌కు పడిపోయింది. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరు నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యఛేదనలో చతికిల పడింది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు.. ముఖ్యంగా హర్‌ప్రీత్ బ్రార్ దెబ్బకు బెంగళూరు బ్యాటింగ్ కకావికలమైంది. తన స్పిన్ మాయాజాలంతో కెప్టెన్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ వంటి కీలక ఆటగాళ్లను వెనక్కి పంపి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు జట్టులో కోహ్లీ (35), రజత్ పటీదార్ (31), హర్షల్ పటేల్ (31), కైల్ జేమీసన్ (16) తప్ప మిగతా వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రాహుల్ 91 పరుగులతో అజేయంగా నిలవగా, క్రిస్ గేల్ మరోమారు మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి బ్యాటింగులో 25 పరుగులు చేసిన హర్‌ప్రీత్ బ్రార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది మూడో విజయం. 6 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News