China: మహమ్మారిని ఓడించడంలో భారత్‌కు సహకరిస్తాం: జిన్‌పింగ్‌

  • కలిసికట్టుగా కరోనాను ఓడించాలని చైనా అధ్యక్షుడి పిలుపు
  • ప్రధాని మోదీకి సంఘీభావ సందేశం
  • భారత్‌లో పరిస్థితులపై తీవ్ర విచారం
  • సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్‌పింగ్‌ సందేశానికి ప్రాధాన్యం
Xi Jingping Extends Help To India

భారత్‌లో కరోనా పరిస్థితులపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. సాయం చేస్తామంటూ ముందుకు వచ్చినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రధాని మోదీకి సంఘీభావ సందేశం పంపినట్లు తెలిపింది.  భారత్‌లో కరోనా మహమ్మారిని ఓడించేందుకు జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తామని లేఖలో జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణపై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాని సమయంలో షీ జిన్‌పింగ్‌ నుంచి భారత్‌ పట్ల సానుకూల వైఖరి వ్యక్తమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకుముందు ప్రధాని మోదీకి జిన్‌పింగ్‌ పంపిన సందేశానికి సంబంధించిన వివరాలను భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వేడాంగ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. వివిధ దేశాల మధ్య సహకారం, సంఘీభావంతోనే ఈ మహమ్మారిని ఓడించగలమని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. భారత ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలు ఈ మహమ్మారి సంక్షోభాన్ని అధిగమిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News