New Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి: ఆప్​ ఎమ్మెల్యే డిమాండ్​

  • ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నానన్న షోయబ్ ఇక్భాల్
  • రాజధానిలో పరిస్థితి అదుపు తప్పిందని కామెంట్
  • ఎవరికీ సాయం చేసే స్థితిలో లేనని ఆవేదన
  • స్వయానా తన స్నేహితుడికే సాయమందించలేకపోయానని వెల్లడి
  • ప్రభుత్వం తమనూ పట్టించుకోవట్లేదని అసహనం
  • రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి
Impose President Rule in Delhi Demands AAP MLA

ఢిల్లీలో కరోనా పరిస్థితి అదుపు తప్పిందని, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే షోయబ్ ఇక్భాల్ అన్నారు. దేశ రాజధానిలో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

‘‘ఢిల్లీలో పరిస్థితులు చూస్తుంటే ఏడుపొస్తోంది. నా గుండె తరుక్కుపోతోంది. కరోనా ఔషధాలు గానీ, ఆక్సిజన్ గానీ పేషెంట్లకు దొరకడం లేదు. నా మిత్రుడూ దాని బారిన పడి పోరాడుతున్నాడు. అతడికి ఆక్సిజన్ చాలా అవసరం. కానీ, ఆక్సిజన్ గానీ, వెంటిలేటర్ గానీ ఏవీ అందుబాటులో లేవు. రెమ్డెసివిర్ మందులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు’’ అని ఇక్బాల్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఈ పరిస్థితులను చూసి తాను ఎమ్మెల్యేగా గర్వపడే కన్నా సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒకరికి సాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమూ తమకు ఎలాంటి సాయం చేయట్లేదన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారైనా తన మాటను పట్టించుకోలేదన్నారు. ఏ ఒక్క అధికారినీ కలవలేకపోతున్నానని చెప్పారు. కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును కోరుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News