EC: కౌంటింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే... ఇవి ఉండాల్సిందే: ఈసీ

  • నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాతానికి ఎన్నికలు
  • మే 2న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ
  • అభ్యర్థులు, ఏజెంట్లు నెగెటివ్ రిపోర్టు తెచ్చుకోవాలని ఈసీ ఆదేశం
Candidates must bring negetive report to enter counting center says EC

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలుచోట్ల జరిగిన ఉప ఎన్నికలకు రానున్న ఆదివారం (మే 2) కౌంటింగ్ జరగనుంది. ఇదే సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు ఆంక్షలను విధించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్లోకి అడుగుపెట్టాలంటే... వారితో పాటు కరోనా నెగెటివ్ రిపోర్టును కచ్చితంగా తీసుకురావాలని తెలిపింది. లేదా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న పత్రాలను తీసుకురావాలని చెప్పింది. ఈమేరకు ఈసీ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.

కౌంటింగ్ సెంటర్ల వెలుపల జనాలు గుమికూడరాదని ఈసీ ఆదేశించింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు 48 గంటలకు ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టులను తీసుకురావాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే వీటిని సమర్పించాలని తెలిపింది. మరోవైపు విజయోత్సవ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు నిన్ననే ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బెంగాల్ లో మాత్రం రేపు చివరి విడత పోలింగ్ జరగనుంది. మరోవైపు, కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎన్నికల ర్యాలీలకు ఈసీ అనుమతించడం వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News