Corona Virus: మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అనుమానమే!

  • మూడవ దశపై అనుమానాలు
  • వయల్స్ సరఫరాలో అవాంతరాలు
  • డిమాండ్ కు తగ్గట్టుగా తయారుకాని టీకాలు
  • ఇవ్వలేమంటున్న రాష్ట్రాల ప్రభుత్వాలు
  • వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ మొదలు
Doubts Over Vaccine Third Phase in India

మరో రెండు రోజుల్లో ఇండియాలో మూడవ దశ వ్యాక్సినేషన్ మొదలు కావాల్సి వుంది. 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు కానున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఏమంత సాఫీగా మొదలయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తుంటే, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కు తీవ్ర అవాంతరాలు ఏర్పడేలా ఉన్నాయి. అందుకు కారణం డిమాండ్ కు తగినంతగా టీకాల సరఫరా లేకపోవడమే. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే టీకాలు నిండుకున్నాయి. కొత్తగా చాలినన్ని టీకా వయల్స్ ఏ రాష్ట్రానికీ సరఫరా కావడం లేదు.

వాస్తవానికి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే, దాదాపు 90 నుంచి 100 కోట్ల డోస్ లు కావాలి. ఈ ఏజ్ గ్రూప్ లో సుమారు 45 కోట్ల మందికి పైగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారందరికీ, ఆపై 45 ఏళ్లు దాటి వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికీ టీకాలు ఇస్తున్నా, అదింకా లక్ష్యాన్ని తాకలేదు. ఇప్పటివరకూ సుమారు 15 కోట్ల డోస్ లను మాత్రమే పంచారు. అందులో రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య 2 కోట్లను కూడా దాటలేదు.

ఇక చాలా రాష్ట్రాలు 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలంటే, తమకు వెంటనే వయల్స్ పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు కావాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లను కోరింది. వచ్చే ఆరు నెలల కాలంలో ఇవి పంపాలని కోరింది. ఇదే తరహా విజ్ఞప్తులు పలు రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ తదితర అన్ని ప్రాంతాల నుంచి వ్యాక్సిన్ కంపెనీలకు లేఖలు అందుతున్నాయి.

ఇదిలావుండగా, టీకాలకు ధర నిర్ణయం విషయంలో సందిగ్ధతలు నెలకొని వున్నాయి. తాము కొనుగోలు చేసే టీకాలను ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ కంపెనీలు కేంద్రానికి ఇచ్చే టీకాలకే తగ్గింపు ధరలను అమలు చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తామని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అందుకయ్యే ఖర్చును తామే భరిస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మూడు నెలల కాలంలో ఎన్ని టీకాలు అందుబాటులో ఉంటాయి? ఎంత మందికి వాటిని ఇవ్వవచ్చు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు.

మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేమని గోవా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కేంద్రం కోరిన డోస్ లను సరఫరా చేయడానికే మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో రాష్ట్రాలకు టీకాలను పంపించేందుకు ఇంకెంత సమయం పడుతుందోనన్న ఆందోళన కూడా ఉంది. వాస్తవానికి నేటి నుంచి కొవిన్ వెబ్ సైట్ లో, ఆరోగ్య సేతు యాప్ లో 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ, రిజిస్టర్ చేసుకున్న వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తారన్న స్పష్టత మాత్రం లేదు.

More Telugu News