Corona Virus: ఆక్సిజన్‌ రవాణాపై ఆంక్షలు విధించొద్దు: రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

  • ఆదేశాలు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి
  • ఆక్సిజన్‌ సరఫరాపై రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయని వార్తలు
  • అప్రమత్తమైన కేంద్రం
  • జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి
No Restrictions on oxygen Movement

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిరంతరాయంగా సాగాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్‌ సరఫరాలపై రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి ఆంక్షలు విధించొద్దని స్పష్టం చేసింది. కఠినమైన ‘విపత్తు నిర్వహణ చట్టం 2005’ను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వెల్లడించారు.

కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్‌ సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలోనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో సొంత రాష్ట్రంలోని అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ రవాణాపై పరిమితులు విధించాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం విపత్తు నిర్వహణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల్ని ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. తాజా నిబంధనల ప్రకారం.. రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల మధ్య ఆక్సిజన్‌ రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.

More Telugu News