Vijayasai Reddy: మీ దరిద్రపు ట్వీట్ వల్ల పార్టీ పరువు పోయింది: విజయసాయిరెడ్డిపై రఘురామకృష్ణరాజు ఫైర్

  • చంద్రబాబుకు జగన్ కూడా సంస్కారంతో విషెస్ చెప్పారు
  • మీ ట్వీట్లను సంస్కారం ఉన్న వాళ్లెవరూ ఇష్టపడరు
  • మీ వల్ల తటస్థ ఓటర్లు పార్టీకి దూరమవుతారు
  • పార్టీ జాతీయ కార్యదర్శిగా మరొకరిని నియమించడం బెటర్
Vijayasai Reddys tweet tarnished the image of YSRCP says Raghu Rama Krishna Raju

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న చేసిన ట్వీట్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని రామాయణం చెపుతోందని... చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంధాలు చదివి ఉంటే మంచి లక్షణాలు వచ్చుండేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ జాతీయ కార్యదర్శివి, రాజ్యసభ సభ్యుడివి, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలందరికీ నాయకుడివి... ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అసలు బుద్ధుందా? ఇదేనా సంస్కారం? అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్, తాను కూడా చాలా సంస్కారంతో శుభాకాంక్షలను తెలియజేశామని... మీరు చేసిన ట్వీట్ దారుణంగా ఉందని అన్నారు. ఇలాంటి సంకుచిత స్వభావాన్ని వీడండని సూచించారు.

చెత్త మాటలు మాట్లాడితే మీకేదో గండపెండేరం తొడుగుతారని భావిస్తున్నారేమో.. మీరు ఇతరులను గౌరవిస్తేనే, సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందని రఘురాజు హితవు పలికారు. మీరు చేసే దిక్కుమాలిన ట్వీట్లను సోషల్ మీడియాలో తప్ప, సంస్కారం ఉన్న వాళ్లెవరూ ఇష్టపడరని అన్నారు. మీరు చేస్తున్న దిక్కుమాలిన, దగుల్భాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓట్లు పార్టీకి దూరమవుతాయని చెప్పారు. మీ వికృత చేష్టల వల్ల... మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో, వాళ్లకే ఆ ఓట్లు పోతాయని అన్నారు.

ఇప్పటికైనా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని విజయసాయికి రఘురాజు సూచించారు. మీరు మీ పంథాను ఇలాగే  కొనసాగిస్తే... పార్టీ జాతీయ కార్యదర్శిగా మీ స్థానంలో మరొకరిని జగన్ నియమిస్తే బాగుంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో సంస్కారం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి పెద్దలను నియమించడం బెటర్ అని వ్యాఖ్యానించారు.

More Telugu News