Jagan: పదో తరగతి పరీక్షలపై అధికారులతో చర్చిస్తున్న సీఎం జగన్

  • ఏపీలో కరోనా బీభత్సం
  • నిన్న 7 వేలకు పైగా కేసులు
  • విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు
  • పబ్లిక్ పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లు మూసివేయాలంటూ ఒత్తిడి
  • టెన్త్ పరీక్షలపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కారు
CM Jagan will take key decision on Tenth class exams

ఏపీలో కరోనా కేసులు నానాటికీ అధికమవుతున్న నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించినా, కరోనా ఉద్ధృతితో సర్కారు పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా, లేక వాయిదా వేయాలా అనే అంశంపై సీఎం జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.

కాసేపట్లో దీనిపై నిర్ణయం ప్రకటించనున్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. మిగిలిన తరగతులు, పరీక్షల విషయంలో కూడా రెండ్రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న తీరు పట్ల అధికారులతో సీఎం జగన్ ఈ మధ్యాహ్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో వ్యాపార సంస్థలు మూసివేశారు. వ్యాపార వేళల్లో కూడా మార్పులు చేశారు. విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు వస్తుండడంతో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లకు సెలవులు ప్రకటించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News