Mamata Banerjee: నాలుగు విడతల పోలింగ్‌ ఓకే రోజు నిర్వహించండి: మమతా బెనర్జీ

Conduct remaining elections on single day Mamata requests EC
  • ఎన్నికల సంఘానికి దీదీ విజ్ఞప్తి
  • బెంగాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
  • ప్రతిపాదనను తోసిపుచ్చిన ఈసీ
  • 8 విడతల పోలింగ్‌పై తృణమూల్‌ విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకొని ఇంకా జరగాల్సిన నాలుగు విడతల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి  మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇకనైనా కరోనా మరింత వ్యాప్తి చెందకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు గత నెల ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక్క బెంగాల్‌లో మాత్రమే ఇంకా పోలింగ్‌ జరగాల్సి ఉంది.

మిగిలిన విడతల పోలింగ్‌ని ఒకే రోజు నిర్వహించాలన్న ప్రతిపాదనను ఈసీ అంతకుముందే తోసిపుచ్చింది. అయితే, తృణమూల్‌ పార్టీ వర్గాలు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఓవైపు మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇంత సుదీర్ఘ పోలింగ్‌ ఏమాత్రం సమంజసం కాదని నాయకులు ఆరోపించారు. రోజురోజుకి కేసులు, మరణాల రేటు పెరిగిపోతోందని గుర్తుచేశారు.
Mamata Banerjee
West Bengal
Assembly Elections

More Telugu News