Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు!

  • టోక్యో ఒలింపిక్స్ కు కరోనా దెబ్బ
  • గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడా సంరంభం
  • కరోనా ప్రభావంతో రీషెడ్యూల్
  • మరోసారి పెరిగిన కరోనా ఉద్ధృతి
  • అవసరమైన ఒలింపిక్స్ రద్దు చేస్తామంటున్న జపాన్ వర్గాలు
Concerns raise on Tokyo Olympics as Corona scares looming again

జపాన్ లో ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన ఒలింపిక్ క్రీడలపై మరోసారి అనుమాన మేఘాలు అలముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కష్టమేనని జపాన్ ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా సంక్షోభం మరింతగా ముదిరితే టోక్యో ఒలింపిక్స్ ను రద్దు చేస్తామని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోషిహిరో నికాయ్  తెలిపారు.

ఒలింపిక్స్ ను జరపలేని పరిస్థితులు ఏర్పడితే, రద్దు చేయడమొక్కటే మార్గమని వెల్లడించారు. ఒలింపిక్స్ నిర్వహణతో కరోనా మరింత వ్యాపిస్తుందని అనుకుంటే, ఒలింపిక్స్ జరపడం ఎందుకు? అని ప్రశ్నించారు.

వాస్తవానికి టోక్యో ఆతిథ్యమివ్వాల్సిన ఒలింపిక్ క్రీడలు 2020 జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండడంతో ఒలింపిక్స్ ను 2021కి రీషెడ్యూల్ చేశారు. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించాలని భావించినా, అప్పటికి కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై అనిశ్చితి నెలకొంది.

ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులందరూ వివిధ దేశాల నుంచి ఒక నెల ముందుగానే టోక్యో చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, అనేక దేశాలు మళ్లీ లాక్ డౌన్ తరహా పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారుల సన్నద్ధత, వారి ప్రయాణాలపై ఆందోళన నెలకొంది. క్రీడాకారులందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇప్పించాలన్న వాదనలు వినిపిస్తున్నా అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

More Telugu News