Andhra Pradesh: ప‌రిష‌త్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లు

  • చిత్తూరు జిల్లా యాద‌మ‌రి మండ‌లం కోన‌ప‌ల్లెలో కారు ధ్వంసం
  • నెల్లూరులోని పానుగోడులో బ్యాలెట్ బాక్సును నీళ్ల‌లో వేసిన అభ్య‌ర్థి
  • ప్ర‌కాశం జిల్లా పామూలో సీపీఐ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న
  • బ్యాలెట్ పత్రాల్లో గుర్తుల వ‌రుస మారింద‌ని నిర‌స‌న
ruckus in voting

ఆంధ్రప్రదేశ్‌లో 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ కొన‌సాగుతోంది. ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా యాద‌మ‌రి మండ‌లం కోన‌ప‌ల్లెలో టీడీపీ వ‌ర్గీయుల‌కు చెందిన ఓ కారు ధ్వంసం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. ఓటు వేసేందుకు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వెళ్లిన స‌మ‌యంలో ఆ కారును ఇంటి వ‌ద్దే ఉంచి వెళ్లారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు దుండ‌గులు దాన్ని ధ్వంసం చేసి వెళ్లారు.

నెల్లూరులోని ఏఎస్ పేట మండ‌లం పానుగోడులో ఎన్నిక‌లు తాత్కాలికంగా నిలిచాయి. బీజేపీ నేత ప్ర‌సాద్ బ్యాలెట్ బాక్సును బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు వ‌చ్చిన అధికారుల‌ను తోసేసి, బ్యాక్సును నీళ్ల‌లో వేశారు.  

ప్ర‌కాశం జిల్లా పామూలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఐ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. బ్యాలెట్ పత్రాల్లో గుర్తుల వ‌రుస మారింద‌ని ఆరోపించారు. ఆ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ జ‌ర‌పాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప‌లువురు సీపీఐ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

క‌డ‌ప జిల్లా వ‌ల్లూరు మండ‌లం మాచిరెడ్డి ప‌ల్లెలో టీడీపీ అభ్య‌ర్థులు బ‌రిలో లేక‌పోవ‌డంతో పోలింగ్ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప‌లువురు స్థానికులు చెప్పారు. విజ‌య‌న‌గ‌రంలోని సీతాన‌గ‌రం మండ‌లం అంబిపేట‌లో పోలింగ్ నిలిచింది. బ్యాలెట్ పేప‌ర్లో త‌ప్పుల‌తో పోలింగ్ రేప‌టికి వాయిదా ప‌డింది.  

More Telugu News