Reliance: ముఖేష్, అనిల్ అంబానీలపై రూ. 25 కోట్ల జరిమానా విధించిన సెబీ!

  • 20 ఏళ్ల క్రితం రిలయన్స్ వాటాల విక్రయం
  • వివరాలు తెలియజేయని ప్రమోటర్లు
  • పలువురిపై జరిమానా
Sebi Fined Ambani Brothers

దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ టేకోవర్ లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చిన సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు, అడాగ్ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీలపై రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 2000 సంవత్సరంలో జరిగిన డీల్ లో 5 శాతం వాటా చేతులు మారగా, దీనికి సంబంధించి సంస్థ ప్రమోటర్లు వివరాలు అందించడంలో విఫలమయ్యారని సెబీ పేర్కొంది. టేకోవర్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెబుతూ, అంబానీ సోదరులు, వారి భార్యలు నీతా అంబానీ, టీనా అంబానీలతో పాటు మరికొన్ని కంపెనీలపైనా జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.

వాస్తవానికి 5 శాతానికి మించిన లావాదేవీల వివరాలను తక్షణమే ప్రజల ముందు ఉంచాలన్న నిబంధనలుండగా, 2000 సంవత్సరంలో 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ వారంట్లతో కూడిన రిడీమబుల్ డిబెంచర్ల ద్వారా సొంతం చేసుకున్నారని సెబీ పేర్కొంది. ఈ వాటాల బదిలీ వివరాలను అదే సంవత్సరం జనవరి 7న ప్రకటించాల్సిన సంస్థ, ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని ఆరోపించింది. ఈ కేసును విచారించిన మీదట ఫైన్ విధించామని, ఈ మొత్తాన్ని అందరూ కలిసి లేదా విడివిడిగా చెల్లించవచ్చని తెలిపింది.

More Telugu News