ipl 2021: షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌: సౌరభ్‌ గంగూలీ

  • మహారాష్ట్రలో కఠిన ఆంక్షలతో అనేక ఊహాగానాలు
  • వాటన్నింటినీ కొట్టిపారేసిన గంగూలీ
  • ఇప్పటికే ముంబయిలో మకాం వేసిన టీమ్‌లు
  • ఈ నెల 10-25 మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు
IPL Goes as per schedule says Sourav Ganguly

ఐపీఎల్‌ 14వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లీగ్‌ నిర్వహణపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్‌ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.

మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. అలాగే వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మూడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 10-25 మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లు ముంబయిలోనే మకాం వేసి సాధన చేస్తున్నాయి.

More Telugu News