Adimulapu Suresh: అచ్చెన్నాయుడు నోరుపారేసుకోవడం సరైన పద్ధతి కాదు: మంత్రి ఆదిమూల‌పు సురేశ్

  • తిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నికలో గెలుస్తాం
  • ప్ర‌భుత్వ ప‌నితీరు, సంక్షేమ పథకాలే అందుకు కార‌ణ‌మ‌వుతాయి
  • ప్రత్యేక హోదాను గ‌త స‌ర్కారు తాకట్టు పెట్టింది  
suresh slams tdp

తిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నిక నేప‌థ్యంలో గెలుపుపై ప‌లు పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధిస్తామ‌ని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. రాష్ట్రంలో త‌మ  ప్ర‌భుత్వ ప‌నితీరుతో పాటు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే అందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాను స్వార్థ ప్ర‌యోజ‌నాల‌ కోసం తాకట్టు పెట్టి గ‌త‌ టీడీపీ స‌ర్కారు ప్ర‌త్యేక‌ ప్యాకేజీకి ఆశ‌ప‌డింద‌ని ఆయ‌న‌ చెప్పారు. ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ విషయం తెలియకే ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు త‌మ పార్టీ ఎంపీలను గొర్రెలంటూ నోరు పారేసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

More Telugu News