Corona Virus: కేసులు పెరుగుతున్నాయి.. టీకా వృథాని అరికట్టాలి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

  • టీకా వృథాను ఒక శాతానికి పరిమితం చేయాలని సూచన
  • దేశంలో ఎక్కడా టీకా కొరత లేదు
  • రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష
Restrict corona wastage to 1 pc

తగ్గినట్టే తగ్గి మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్‌. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టీకాల కోసం విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో టీకా డోసుల్ని జాగ్రత్తగా.. ఎలాంటి వృథా లేకుండా వాడుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో టీకా వృథాను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.  

టీకా వృథాను ఒకశాతం లోపునకే పరిమితం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా టీకాల కొరత లేదని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ సమావేశమయ్యారు. టీకా కార్యక్రమం జరుగుతోన్న తీరును సమీక్షించడంతో పాటు పలు సూచనలు చేశారు.

దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం టీకా డోసులను పంపిణీ చేయనుంది.

రాష్ట్రాలకు కేంద్రం సూచనలు...

* కరోనా టీకా అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి, వెంటనే చర్యలు తీసుకోవాలి.
* ప్రస్తుతం ఉన్న ఆరు శాతం టీకా వృథాను ఒక శాతానికి పరిమితం చేయాలి. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి.
* టీకాల కాల పరిమితి ముగియకముందే వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.
* టీకా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని కొవిన్‌, ఈవిన్‌ పోర్టల్‌లలో ఎప్పటికప్పుడు పొందుపరచాలి.

ఇప్పటి వరకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 6.30 కోట్ల పైచిలుకు మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.

More Telugu News