Mahesh Babu: మహేశ్ బాబు హీరోగా మరో రామాయణం!

  • పలు భాషలలో తెరకెక్కనున్న రామాయణం 
  • నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన
  • శ్రీరాముడి పాత్రకు మహేశ్ తో సంప్రదింపులు
  • సీతగా దీపిక పదుకొణే.. రావణుడిగా హృతిక్  
Mahesh Babu to play Srirama in another Ramayana movie

ఎప్పటినుంచో మన దర్శక నిర్మాతలకు రామాయణం, మహాభారతం పౌరాణిక కథలు మంచి ఇతివృత్తాలుగా వున్నాయి. వీటి ఆధారంగా పలువురు పలు రకాలుగా సినిమాలు నిర్మించారు. వీటిలో ఆకట్టుకునేలా తీసిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి కూడా.

ఇదే కోవలో ఇప్పుడు ఓపక్క ప్రభాస్ హీరోగా రామాయణాన్ని 'ఆదిపురుష్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. మరోపక్క, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కూడా రామాయణ కథతో మరో భారీ చిత్రం నిర్మాణం జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి నితీశ్ తివారీ (దంగల్ ఫేమ్), రవి ఉడయార్ (మామ్ ఫేమ్) సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరో నిర్మాత మధు మంతెనతో కలసి దీనిని  నిర్మించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని నిర్మించాలని వీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పటికీ, ఇటీవల ఆ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో శ్రీరాముడి పాత్రకు మహేశ్ బాబుని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఇందులో సీతగా బాలీవుడ్ భామ దీపిక పదుకొణే, రావణుడిగా హృతిక్ రోషన్ నటించనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

More Telugu News