Ramesh Jarkiholi: కర్ణాటక రాసలీలల సీడీ కేసు.. మాజీ మంత్రిని 5 గంటలపాటు విచారించిన అధికారులు

Ramesh Jarkiholi Grilled for 5 Hours in Sex CD Case
  • ఉదయం పది గంటల సమయంలో విచారణకు హాజరు
  • అధికారుల ప్రశ్నలకు మౌనాన్ని ఆశ్రయించిన మాజీ మంత్రి
  • విచారణ అనంతరం అజ్ఞాతంలోకి
రాసలీలల సీడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళిని నిన్న అధికారులు 5 గంటలపాటు విచారించారు. స్థానిక అడిగొడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం ( ఎస్ఐటీ) సాంకేతిక విభాగం అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పెదవి విప్పలేదు. ఉదయం పది గంటల సమయంలో మడివాలాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి జార్కిహోళి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. ఆ తర్వాత వారిని వాహనంలో వదిలి ఆయన టెక్నికల్ వింగ్ రూములోకి వెళ్లారు. విచారణ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో బయటకు వచ్చారు.

విచారణలో తొలి గంట తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, దీంతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, చివరి నాలుగు గంటలు మాత్రం ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పెదవి విప్పలేదని సమాచారం. విచారణ అనంతరం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు, సీడీలో కనిపించిన బాధిత యువతి నిన్న కోర్టుకు హాజరవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే, రాత్రి వరకు ఆమెకు కోర్టు నుంచి అనుమతి లభించలేదని సమాచారం.
Ramesh Jarkiholi
Karnataka
Sex CD Case
SIT

More Telugu News