Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దొంగతనానికి యత్నించిన దుండగుడు?

  • నిన్న రాత్రి ఆలయంలో ఒక వ్యక్తి గడిపినట్టు అనుమానం
  • రెండు హుండీల్లో చోరీ కోసం ప్రయత్నం
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించేందుకు యత్నిస్తున్న పోలీసులు
Robbery attempt in Tirupati Govindaraja Swamy temple

తిరుపతిలోని ప్రముఖ గోవిందరాజస్వామి దేవాలయంలో దొంగతనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని టీటీడీ నిఘా విభాగం అనుమానిస్తోంది. నిన్న రాత్రి ఒక వ్యక్తి ఆలయంలోనే ఉన్నాడని భావిస్తోంది. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేసిన తర్వాత అతను దొంగతనానికి ప్రయత్నించినట్టు అధికారులు భావిస్తున్నారు.

 ఆలయంలోని వినాయకుడి విగ్రహం వద్ద, ధ్వజస్తంభం వద్ద ఉన్న రెండు హుండీల్లో చోరీకి ప్రయత్నించినట్టు భావించిన నిఘా సిబ్బంది... తిరుపతి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఆచూకీ కోసం ఆలయ సిబ్బంది, పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

మరోవైపు గుడిలో అన్ని చోట్ల తాళాలు వేసి ఉండటంతో దొంగ ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం సుప్రభాతం సమయంలో అర్చకులు, అధికారులు ఆలయ తాళాలు తెరిచారు. అనంతరం ఉదయం భక్తుల్లో కలిసిపోయి దొంగ వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు. 

More Telugu News