West Bengal: ఐదు నిమిషాల్లోనే పోలింగ్​ శాతం సగానికి సగం ఎలా తగ్గింది?: ఈసీకి తృణమూల్​ ఫిర్యాదు

  • తృణమూల్ కు ఓటేసినా పడట్లేదని ఆరోపణ
  • బీజేపీకి పడినట్టు చూపిస్తోందని కామెంట్
  • ఇది క్షమించరానిదని మండిపాటు
Trinamool Alleges Voter Turnout Discrepancy EVM Malfunction

బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఆ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు నిమిషాల్లోనే పోలింగ్ శాతం సగానికి సగం ఎలా తగ్గిందని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ లేఖ రాశారు. ఈరోజు బెంగాల్ లో తొలి దశ ఓటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పోలింగ్ శాతంపై తృణమూల్ అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 నిమిషాల్లోనే పోలింగ్ శాతం సగానికి సగం ఎలా తగ్గిందో ఎన్నికల సంఘం చెప్పాలి. షాకింగ్ విషయమిది. బెంగాల్ ఎన్నికల ముఖ్య అధికారి దీనిపై వెంటనే స్పందించాలి’’  అని తృణమూల్ పార్టీ ట్వీట్ చేసింది.

తృణమూల్ కు ఓటు పడడం లేదని ఓటర్లు చెబుతున్నారంటూ మరో ట్వీట్ లో పేర్కొంది. కాంతి దక్షిణ అసెంబ్లీ సీట్ లో చాలా మంది ఓటర్ల నుంచి ఇవే ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించింది. తృణమూల్ కు ఓటేస్తే వీవీప్యాట్ లలో బీజేపీకి ఓటు పడినట్టు చూపిస్తున్నాయని ఓటర్లు చెప్పారని పేర్కొంది. ఇది క్షమించరానిదని మండిపడింది.

కాగా, పోలింగ్ బూత్ లలోకి బయటి ఏజెంట్లను అనుమతించడంపై బెంగాల్ సీఈవోకు అభ్యంతరాలు తెలియజేశామని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ఇంతకుముందు స్థానిక బూత్ లలో ఓటు హక్కు ఉన్నవారినే అక్కడ ఏజెంట్లుగా నియమించేలా నిబంధన ఉండేదని, కానీ, ఆ నిబంధనలను బీజేపీ మార్చేసిందని అన్నారు. ఆ నిబంధనను మార్చాల్సిందిగా సీఈవోను కోరామన్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36 శాతం పోలింగ్ నమోదైంది.

More Telugu News