Vinukonda: వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా.. నీ సంగతి తేలుస్తా: విలేకరిపై వినుకొండ ఎమ్మెల్యే వీరంగం

Bolla Brahmanaidu fires on reporters
  • గత పదేళ్లలో సమస్యలే లేవా? ఇప్పుడే ఉన్నట్టు రాస్తారా?
  • బయటకు పో అంటూ మరో విలేకరిపైనా మండిపాటు
  • తాగునీటి సమస్యలపై వార్తలు రాసిన విలేకరిపై తిట్ల దండకం
ఓ పత్రికా విలేకరిపై వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిందులు తొక్కారు. వార్తలు రాసి నన్ను బెదిరించాలని చూస్తావా? నీ సంగతి తేలుస్తా అంటూ హెచ్చరించారు. నిన్న తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ హెచ్చరికలు చేశారు. వినుకొండలో అసైన్డ్ భూములు ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేస్తున్నారని, ఆ వార్తలు రాయకుండా పట్టణంలోని సమస్యలపైనే వార్తలు ఎందుకు రాస్తున్నారని విలేకరులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ పత్రికా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘‘పట్టణంలో గత పదేళ్లలో సమస్యలు లేవా? ఇప్పుడే ఉన్నాయా? నువ్వు చాలా చేస్తున్నావ్. నీ సంగతేంటో తేలుస్తా. వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా? నువ్వెంత’ అంటూ సీటులోంచి లేచి ఆగ్రహంతో ఊగిపోయారు.

కల్పించుకున్న ఓ చానల్ విలేకరి భూముల ఆక్రమణలపైనా వార్తలు రాస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యే మరోమారు మండిపడ్డారు. ‘‘ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. బయటకు పో’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. తాగునీటి సమస్యలపై వార్తలు రాసిన మరో విలేకరిపైనా ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నారు.

Vinukonda
Bolla Brahmanaidu
Reporters
YSRCP

More Telugu News