ISRO: అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియాతో క‌లిసి భార‌త్ అంత‌రిక్ష ప్రాజెక్టులు

  • చైనా చ‌ర్య‌ల‌ను నియంత్రించ‌డానికి క్వాడ్ దేశాల కృషి
  • అమెరికాతో క‌లిసి భార‌త్ నిసార్ ఉపగ్రహ ప్రాజెక్టు
  • చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ
  • 2023 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువానికి  భార‌త్, జ‌పాన్ వ్యోమనౌక
isro projects with usa japan

చైనా పాల్ప‌డుతోన్న చ‌ర్య‌ల‌ను నియంత్రించ‌డానికి క్వాడ్‌ భాగస్వామ్య దేశాలు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ నాలుగు దేశాలు ర‌క్ష‌ణ రంగంలోనే కాకుండా అంత‌రిక్ష రంగంలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నియంత్ర‌ణ‌తో పాటు, భ‌విష్యత్‌ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై ఆయా దేశాలు దృష్టి సారించనున్నాయి.

ఈ మేర‌కు కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నాయి. మరోవైపు, అంతరిక్ష రంగంలోనూ నాలుగు దేశాలు కలసి ఉమ్మడిగా సాగేందుకు చ‌ర్చ‌లు జ‌రిపాయి. అమెరికాతో క‌లిసి అభివృద్ధి చేస్తున్న ‘నిసార్‌’ ఉపగ్రహం కోసం ఇస్రో ఒక ఎస్‌-బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను రూపొందించింది. వ‌చ్చే ఏడాది శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు.

అంతేగాక‌, భారత‌ చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో నాసాకు చెందిన లేజర్‌ రిఫ్లెక్టోమీటర్‌ అరే (ఎల్‌ఆర్‌ఏ)ను అమర్చనున్నారు. అమెరికాతోనే కాకుండా జపాన్‌తోనూ స్నేహ బంధాన్ని ఇస్రో బలోపేతం చేసుకుంటోంది. ఈ రెండు దేశాలు భూ పరిశీలనతో పాటు చంద్రమండలంపై అన్వేషణ, ఉపగ్రహ నేవిగేషన్‌ వంటి విష‌యాల్లో క‌లిసి ప‌నిచేయ‌నున్నాయి. 2023 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువానికి ఒక వ్యోమనౌకను సంయుక్తంగా పంపాలని భార‌త్, జ‌పాన్ నిర్ణ‌యం తీసుకున్నాయి.

More Telugu News