Bandi Sanjay: ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి?: బండి సంజ‌య్ ఆగ్ర‌హం

  • సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్నారు
  • స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి
  • హిందూ మనోభావాలను దెబ్బతీసే కుట్ర
  • సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే ఇలాంటి చ‌ర్య‌లు
bandi sanjay slams trs government

హిందూ దేవతలెవరినీ పూజించ‌బోన‌ని,  బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించబోనని వందలాది మంది ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేరో పవిత్రమాసం కార్యక్రమ ప్రారంభంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామంలోని బౌద్ధక్షేత్రంలో పాలరాతి బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేప‌థ్యంలో అక్క‌డున్న వారంద‌రితోనూ ఈ ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా ఉండడం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. దీనిపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు.

'సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కుట్ర జరుగుతోంది. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి? మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా?'  అని సంజ‌య్ ట్వీట్ చేశారు.
 
'హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోంది? చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోంది. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారు' అని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
'ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము' అని బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.

More Telugu News