Rajamouli: ‘దృశ్యం’ దర్శకుడిపై రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

  • ‘దృశ్యం 2’ సినిమా చూశాను
  • నా ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి
  • ‘దృశ్యం’ ఒక మాస్టర్‌ పీస్
  • అంతే ఉత్కంఠతో సీక్వెల్‌ తీసుకురావడం గొప్ప విషయం  
rajamouli praises drishyam director

‘దృశ్యం’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్‌పై ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్రశంసల జ‌ల్లు కురిపించారు. మలయాళంలో జీతూ జోసెఫ్  తీసిన 'దృశ్యం' హిట్ కావ‌డంతో 'దృశ్యం 2' సినిమా కూడా తీసి మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇందులోనూ మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో న‌టించారు.
 
ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో దీనిపై జీతూ జోసెఫ్‌కు రాజ‌మౌళి వాట్సాప్‌లో మెసేజ్ పంపారు. ఈ మెసేజ్ గురించి జీతూ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.

తాను దృశ్యం 2 సినిమా చూసిన తర్వాత త‌న ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయని జీతూకి రాజ‌మౌళి మెసేజ్ చేశారు. మొద‌టి సారి తెలుగులో దృశ్యం విడుద‌లైన‌ప్పుడు తాను వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ ‘దృశ్యం’ సినిమా చూశానని రాజ‌మౌళి తెలిపారు.

ఈ సినిమా దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్  అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సినిమా క‌థ‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడి ఉంద‌ని ప్ర‌శంసించారు. ‘దృశ్యం’ ఒక మాస్టర్‌ పీస్ అని, అంతే ఉత్కంఠతో సీక్వెల్‌ తీసుకురావడం గొప్ప విషయమ‌ని చెప్పారు. జీతూ నుంచి మరికొన్ని మాస్టర్‌ పీస్ సినిమాలు రావాలని అన్నారు.

More Telugu News