USA: చైనాపై మేమొక్కళ్లమే మాట్లాడితే సరిపోదు.. ప్రపంచం మొత్తం ఏకం కావాలి: అమెరికా విదేశాంగ మంత్రి

  • వియ్ గర్ల ఊచకోతపై గళం వినిపిస్తామన్న బ్లింకెన్
  • అక్కడి పరిస్థితులేంటో ప్రపంచానికి చైనా చూపించాలి
  • వచ్చే వారం చైనా విదేశాంగ మంత్రితో సమావేశం
  • మార్చి 18న ఉంటుందన్న శ్వేత సౌధం
US will speak out forcefully against China committing genocide against Uyghur Muslims Says Blinken

చైనా షిన్జియాంగ్ ప్రావిన్స్ లో వియ్ గర్ ముస్లింలను చైనా ఊచకోత కోయడంపై గళాన్ని గట్టిగా వినిపిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. వచ్చే వారం చైనా ఉన్నతాధికారులతో జరగబోయే సమావేశంలో దీనిపై మాట్లాడతామన్నారు.

దీనిపై శ్వేతసౌధం అధికారిక ప్రకటన చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, వ్యవహారాల అధికారి యాంగ్ జైచీతో మార్చి 18న అలాస్కాలోని యాంకరేజ్ లో బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ లు సమావేశమవుతారని వెల్లడించింది.

వియ్ గర్లను ఊచకోత కోస్తూ మానవ హక్కులను కాలరాస్తున్న చైనా తీరును గట్టిగా తిప్పికొడతామని విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులకు వివరించారు. అవన్నీ కచ్చితంగా హత్యలేనన్నారు. ఈ విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. అమెరికా ఒక్కటే మాట్లాడితే సరిపోదని, ప్రపంచం మొత్తం దానిపై మాట్లాడేలా చేయాలని, ప్రపంచ దేశాలు ఏకం కావాలని అన్నారు.

ఇలాంటి విషయాల్లో చైనాపై ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నామని, మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్కడ ఏం జరగట్లేదని చెబుతున్న చైనా.. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు అంతర్జాతీయ సమాజానికి ఎందుకు అనుమతినివ్వట్లేదని ప్రశ్నించారు.

More Telugu News