Mumbai: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహిళ.. కోటి రూపాయలు సమర్పించుకుని మోసపోయిన వృద్ధుడు!

  • మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
  • ఆస్తి అమ్మగా వచ్చిన రూ. 2 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసిన వృద్ధుడు
  • అదే బ్యాంకులో పనిచేస్తున్న మహిళ వల
  • అండగా ఉంటానంటూ నిండా ముంచేసిన వైనం
Woman Cheated Old Man In the name of marriage

ఓ వృద్ధుడి పెళ్లి ఆశ అతడిని నిండా ముంచింది. 73 ఏళ్ల వయసున్న అతడిని పెళ్లి చేసుకుని అండగా ఉంటానంటూ ఓ మహిళ నమ్మబలకడంతో ఏకంగా కోటి రూపాయలు సమర్పించుకున్నాడు. చివరికి మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ముంబైలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా వయసు 73 ఏళ్లు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లను 2019లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుని తన వద్దే ఉంచుకున్నాడు.

అదే బ్యాంకులో పనిచేస్తున్న షాలినీ అనే మహిళ ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా గమనించింది. వృద్ధుడు ఉపసంహరించుకున్న సొమ్ముపై కన్నేసిన నిందితురాలు పథకం రచించింది. బ్యాంకుకు వచ్చే అతడితో నెమ్మదిగా పరిచయం పెంచుకుంది. ఆపై మరింత ముందుకెళ్లి పెళ్లి చేసుకుని అండగా ఉంటానని నమ్మించింది.

ఆమె మాటలకు లొంగిపోయిన వృద్ధుడు షాలినితో కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగాడు. జెరాన్ తన ట్రాప్‌లో పడ్డాడని నమ్మిన షాలిని తన ప్లాన్ అమలు చేసింది. తానో వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టబడి పెడితే వచ్చే లాభాల్లో చెరిసగం తీసుకుందామని చెప్పింది. కాబోయే భార్యే కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా జెరాన్ రూ. 1.3 కోట్లను గతేడాది డిసెంబరులో ఆమె ఖాతాలో వేశాడు.  

డబ్బు తన ఖాతాలోకి వచ్చిందో, లేదో షాలిని వృద్ధుడి నుంచి దూరం జరిగింది. తన ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. బాధిత వృద్ధుడు ఆమెను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న జెరాన్ గత డిసెంబరులోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసం నిజమేనని నిర్ధారించి తాజాగా కేసు నమోదు చేశారు.

More Telugu News