India: ఇండియాలో క్రమంగా పెరుగుతున్న కొత్త కరోనా కేసులు... కేంద్రం తాజా గైడ్ లైన్స్!

  • కొత్త ప్రయాణ నిబంధనలు
  • 187కు పెరిగిన యూకే స్ట్రెయిన్ కేసులు
  • ప్రయాణించాలంటే ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి
Center New Guidelines for Travellers

సాధారణ కరోనాతో పోలిస్తే, మరింత వేగంగా వ్యాపిస్తున్న సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ కొవిడ్ స్ట్రెయిన్స్ ఇండియాకూ రావడం, కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రయాణికులకు, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలను ప్రభుత్వం విధించింది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

కాగా, ఇప్పటికే ఇండియాలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ నలుగురిలో, బ్రెజిల్ స్ట్రెయిన్ ఒకరిలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో యూకే స్ట్రెయిన్ కేసులు 187కు చేరాయి. ఇక కొత్త ట్రావెల్ గైడ్ లైన్స్ ప్రకారం, విమాన ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే విమానం ఎక్కేందుకు అనుమతినిస్తారు. ఈ పరీక్ష చేయించుకునేందుకు అవసరమైన ఖర్చును ప్రయాణికులే భరించాల్సి వుంటుంది. ఇక, కుటుంబంలో ఎవరైనా మరణించడం వల్ల విదేశాలకు వెళ్లవలసి వస్తే కనుక వారికి మినహాయింపు ఉంటుంది.

ఇక ఎవరికైనా వైరస్ సోకితే, వారి కోసం ప్రత్యేక ప్రొటోకాల్ ను పాటించాల్సి వుంటుంది. ఇదిలావుండగా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్లు యూకే వేరియంట్ పై పని చేస్తున్నాయని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లపై ఇవి ఎలా పనిచేస్తాయన్న విషయమై ప్రయోగాలు సాగుతున్నాయని తెలియజేశారు.

More Telugu News