Jagan: మధ్య తరగతికి తక్కువ ధరకే ఇళ్లు ఇవ్వడంపై సీఎం జగన్ సమీక్ష

  • అధికారులతో సీఎం జగన్ సమావేశం
  • పట్టణ గృహ నిర్మాణ అంశంపై చర్చ
  • అధికారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న సీఎం
  • అర్హులకు క్లియర్ టైటిళ్లతో ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశాలు
  • రింగ్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టీకరణ
CM Jagan reviews on urban housing

పట్టణ గృహ నిర్మాణం అంశంపై సీఎం జగన్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు ఇవ్వడంపై చర్చించారు. నగరాలు, పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల సాకారంపై ఆయన అధికారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, అత్యున్నత జీవన ప్రమాణాలను అందించాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. పట్టణ ప్రాంతాల్లో అర్హులకు అన్ని అనుమతులు, క్లియర్ టైటిళ్లతో ఫ్లాట్లు ఇవ్వాలని స్పష్టం చేశారు.

తక్కువ ధరకే స్థలాలు, ఇళ్లు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి భూములు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల చుట్టూ రింగ్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రింగ్ రోడ్ల చుట్టూ స్మార్ట్ టౌన్ లే అవుట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.  భూములిచ్చేవారికి, ప్రభుత్వానికి లబ్ది కలిగేలా రింగ్ రోడ్లు ఉండాలని వివరించారు. ఈ క్రమంలో తొలి విడతగా 12 పట్టణాల్లో ఈ తరహాలో 18 లేఅవుట్లు నిర్మించాలన్నది తమ నిర్ణయం అని సీఎం జగన్ వెల్లడించారు.

More Telugu News