Bandi Sanjay: టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచే కుట్ర చేస్తున్నాయి: బండి సంజయ్

  • జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక
  • టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం
  • ఆగ్రహంతో స్పందించిన బండి సంజయ్
  • ఆ రెండు పార్టీలది అక్రమ సంబంధం అంటూ వ్యాఖ్యలు
  • పైసా అవినీతి జరిగినా బజారుకీడ్చుతామని హెచ్చరిక
Bandi Sanjay fires in TRS and MIM after GHMC Mayor election

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్-ఎంఐఎం అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైందని అన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండడం ఖాయమని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్రచేస్తున్నాయని సంజయ్ మండిపడ్డారు. ఒక్క పైసా అవినీతి జరిగినట్టు తెలిసినా ఈ రెండు పార్టీలను బజారుకీడ్చుతామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో తమ మధ్య పొత్తులేదని, తాము వేర్వేరు అని చెప్పి సిగ్గులేకుండా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. నిజాయతీతో కూడిన రాజకీయం చేయాలని అనుకుంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాల్సిందని హితవు పలికారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్లే టీఆర్ఎస్ కు ఆ మాత్రం స్థానాలైనా వచ్చాయని, పక్కా మతతత్వ పార్టీ ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచా అని ఇవాళ రుజువైందని అన్నారు.

More Telugu News