ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన పవన్ కల్యాణ్
వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని జనసేన నిశ్చయించింది. ఈ క్రమంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పయనమయ్యారు. పవన్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హస్తిన వెళ్లారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే అంశంపైనా, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపైనా పవన్, నాదెండ్ల బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చిస్తారని జనసేన పార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.