Corona Virus: 20 రోజుల్లో 50 లక్షల మందికి టీకా: కేంద్రం

  • దేశంలో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
  • నిన్న ఒక్క రోజే  5,09,893 మందికి టీకాలు
  • ప్రపంచవ్యాప్తంగా 67 దేశాల్లో ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్
50 lakh people vaccinated in India

దేశంలో ఇప్పటి వరకు 50 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. కేవలం 20 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశం మనదేనని పేర్కొంది. జనవరి 16న దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. నిజానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజుల్లో కొంత నెమ్మదిగానే సాగగా, ఆ తర్వాత మాత్రం ఊపందుకుంది.

నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11,814  కేంద్రాల్లో 5,09,893 మందికి టీకాలు వేశారు. మొత్తం 8 రాష్ట్రాల్లో దాదాపు 61 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో 11.9 శాతం మందికి టీకా ఇచ్చినట్టు కేంద్రం పేర్కొంది. తొలి డోసు తీసుకున్న వారికి ఈ నెల 13 నుంచి రెండో డోసు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, జులై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇంతవరకు 11.90 కోట్ల మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో మిగతా దేశాలతో పోలిస్తే అమెరికా ముందుంది. అక్కడ ఇప్పటి వరకు 3.67 కోట్ల మందికి టీకా వేశారు.

More Telugu News