Stock Market: నేడు కూడా లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా నాలుగో రోజు కూడా లాభాలు
  • 358.54 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
  • 105.70 పాయింట్ల లాభంలో నిఫ్టీ
  • మెరిసిన బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు  
Stock markets close in green

 కేంద్ర బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు పోటెత్తుతున్నాయి. దీంతో మన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పంట పండించుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా వరుసగా నాలుగో రోజు మన మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

ఉదయం మార్కెట్లు ఓపెన్ అయిన కాసేపటివరకు మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో మొదట్లో మార్కెట్లు నష్టాలలో ట్రేడయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కొనుగోళ్ల కళ రావడంతో చివరికి లాభాలతో క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు నేటి ర్యాలీని ముందుండి కొనసాగించాయి.  

ఈ క్రమంలో సెన్సెక్స్ 358.54 పాయింట్ల లాభంతో 50614.29 వద్ద ముగియగా, నిఫ్టీ 105.70 పాయింట్ల లాభంతో 14895.65 వద్ద క్లోజ్ అయింది. బాల్ కృష్ణ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సెర్వ్ తదితర షేర్లు బాగా లాభపడగా; ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

More Telugu News