Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్.. నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో హత్య!

  • ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన సిద్ధార్థ
  • మాజీ సీఎం ధరంసింగ్‌కు బంధువు
  • గత నెల 19న కిడ్నాప్
  • పోలీసుల అదుపులో నిందితుడు
Former Karnataka chief minister N Dharam Singh relative killed

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దివంగత ధరంసింగ్ బంధువు సిద్ధార్థ దేవేందర్‌ను (28) కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు.

అమెరికాలో ఉంటున్న సిద్ధార్థ ఇటీవలే కర్ణాటకలోని అమృతహళ్లి వచ్చారు. ఈ సందర్భంగా స్నేహితులను కలవాలని నిర్ణయించుకున్నారు. గత నెల 19న ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధార్థ అదృశ్యమయ్యారు. బయటకు వెళ్లిన కుమారుడి ఆచూకీ గల్లంతు కావడంతో ఆందోళన చెందిన ఆయన తండ్రి గత నెల 25న అమృతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు సిద్ధార్థను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థను హత్య చేసినట్టు గుర్తించారు. అమృతహళ్లి పోలీసులు నిన్న రాపూరు అటవీ ప్రాంతానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News