Anna Hazare: అన్నా హజారే యూ టర్న్.. రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టడం లేదని ప్రకటన

Social Activist Anna Hazare Cancels Fast Over Farm Reforms
  • దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం ప్రకటన
  • కనీస మద్దతు ధరను 50 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యాఖ్య
  • తాను ప్రతిపాదించిన 15 డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం అంగీకరించిందన్న హజరే
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే యూటర్న్ తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించిన ఆయన.. తాాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం ఆయన సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు.

కనీస మద్దతు ధరను 50 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తనకు లేఖ అందిందని, తాను ప్రతిపాదించిన 15 డిమాండ్ల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిసిందని, అందుకే నిరాహార దీక్ష ఆలోచనను విరమించుకుంటున్నట్టు హజారే తెలిపారు.

కాగా, అన్నా హజారే ఇటీవల మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి రైతు సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్రలోని తన సొంత పట్టణమైన రాలేగావ్ సిద్ధిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. తన మద్దతుదారులందరూ వారివారి ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

గత నాలుగేళ్లుగా రైతుల సమస్యలపై తాను పోరాడుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 84 ఏళ్ల హజారే విమర్శించారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం వినడం లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించిన తమ డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు.


గత మూడు నెలల్లో ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఐదు సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు తమతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 

Anna Hazare
agricultural laws
Fast

More Telugu News