Rajinikanth: తమిళనాడులో కొత్త పార్టీని ప్రారంభించనున్న రజనీకాంత్ సన్నిహితుడు!

  • కొత్త పార్టీని పెడుతున్న అర్జునమూర్తి
  • పోయెస్ గార్డెన్ లో సభను ఏర్పాటు చేయనున్న వైనం
  • రజనీ ఆశీర్వాదాలు తనకు ఉన్నాయన్న అర్జునమూర్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన వెనకడుగు వేసి అభిమానులను ఉసూరుమనిపించారు. రజనీ రాకతో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయన రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించారు. తాజాగా ఓ వార్త తమిళనాట వేడిని పెంచుతోంది. రజనీ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన సన్నిహితుడు అర్జునమూర్తి కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. రజనీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమన్వయకర్తగా పని చేసిన అర్జునమూర్తికి చాలా రాజకీయ అనుభవం ఉంది.

గతంలో తమిళనాడు బీజేపీ మేధో విభాగం అధ్యక్షుడిగా అర్జునమూర్తి పని చేశారు. ఆ తర్వాత రజనీ పార్టీలో చురుకుగా వ్యవహరించారు. రజనీ రాజకీయాల్లోకి రానని ప్రకటించిన నేపథ్యంలో, తానే కొత్త పార్టీ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పోయెస్ గార్డెన్ లో త్వరలోనే సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రజనీ ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని, ఆయన అభిమానులు తనను ఆదరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.

More Telugu News