Somu Veerraju: తిరుపతి ఎంపీ అభ్యర్థిపై పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు చర్చలు

AP BJP Chief Somu Veerraju met Pawan Kalyan in Hyderabad
  • ఈ ఉదయం హైదరాబాదులో పవన్ ను కలిసిన సోము వీర్రాజు
  • తిరుపతి ఎంపీ అభ్యర్థిపై సమాలోచనలు
  • తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ
  • 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ
  • అభిప్రాయభేదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని నిర్ణయం
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అవగాహన కోసం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులో ఈ ఉదయం సమావేశం జరిగింది. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఎంపీ అభ్యర్థి, తాజా రాజకీయ పరిస్థితులు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని ఆ ప్రకటనలో తెలిపారు.

2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలతో నాంది పలకాలని పవన్, సోము వీర్రాజు నిర్ణయించారు. ఏదైనా అంశంలో అభిప్రాయభేదాలు ఉంటే ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని తీర్మానించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించి విజయానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చారు.
Somu Veerraju
Pawan Kalyan
Hyderabad
Tirupati LS Bypolls
Janasena
BJP

More Telugu News