Bandi Sanjay: కేటీఆర్ సీఎం కాగానే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుంది: బండి సంజయ్

  • కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ పూజలు చేశారు
  • బీజేపీతో స్నేహం ఉందని కేసీఆర్ చెపుతున్నారు
  • ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదు
KCR says TRS allied with BJP says Bandi Sanjay

తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి, పూజ సామగ్రిని కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరిలో కలిపారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన వెంటనే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుందని చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

కేటీఆర్ ను సీఎం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు కూడా చెప్పొచ్చానని, బీజేపీతో స్నేహం ఉంటుందంటూ తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కేసీఆర్ చెప్పిస్తున్నాడని విమర్శించారు. ఏ పార్టీ కూడా కేసీఆర్ తో కాని, టీఆర్ఎస్ తో కాని పొత్తు పెట్టుకోదనే విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు.

బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటే అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెపుతున్నారని... ఇదంతా అబద్ధమని అన్నారు. ఆయనకు ఒక సవాల్ విసురుతున్నానని... ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షా, నడ్డాలను కలుద్దామని... ఆ దమ్ము నీకుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని దుయ్యబట్టారు.

More Telugu News