Jair Bolsonaro: 'ధన్యవాద్​ భారత్' అంటూ సంజీవని పర్వతాన్ని మోసుకొస్తున్న ఆంజనేయుడి ఫొటో ట్వీట్​ చేసిన బ్రెజిల్​ అధ్యక్షుడు

  • గౌరవం తమదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యుత్తరం
  • బ్రెజిల్ కు చేరిన 20 లక్షల డోసుల కరోనా టీకాలు
  • ప్రపంచ ఔషధాగారాన్ని నమ్మండి అన్న విదేశాంగ మంత్రి
PMs Honour Is Ours Reply To Brazil Presidents Dhanyawaad For Vaccine

బ్రెజిల్ కు భారత్ పంపిన కరోనా వ్యాక్సిన్ డోసులు అందాయి. నిన్న 20 లక్షల కొవిషీల్డ్ డోసులను భారత్ పంపించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్లను తీసుకెళ్లిన విమానం ఈరోజు అక్కడి ఎయిర్ పోర్టులో దిగింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ధ్రువీకరించారు. ప్రపంచ ఔషధాగారాన్ని నమ్మండి అంటూ ట్వీట్ చేశారు. భారత్ లో తయారైన టీకాలు బ్రెజిల్ కు చేరాయన్నారు.

దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోసనారో స్పందించారు. ‘ధన్యవాద్ భారత్’ అని ట్వీట్ చేశారు. కరోనా వ్యాక్సిన్లతో కూడిన సంజీవని పర్వతాన్ని మోసుకొస్తున్నట్టున్న ఆంజనేయుడి ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ‘‘నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను అధిగమించే ప్రయత్నాల్లో ఓ గొప్ప భాగస్వామిని కలిగి ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నాం. భారత్ నుంచి మాకు వ్యాక్సిన్లు పంపి సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాద్ భారత్’’ అని ఆయన ట్వీట్ చేశారు.

బోసనారో ట్వీట్ కు ప్రధాని మోదీ కూడా రిప్లై ఇచ్చారు. ఆ గౌరవం తమదన్నారు. ‘‘కరోనా మహమ్మారితో పోరులో బ్రెజిల్ వంటి దేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉన్నందుకు ఆ గౌరవం మాది. ఆరోగ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత దృఢం చేసుకుందాం’’ అని ట్వీట్ చేశారు.

More Telugu News