టీడీపీ నేత అంకులు హత్యకేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం: గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్
- ఈ నెల 3న అంకులు దారుణ హత్య
- నమ్మించి పిలిపించి గొంతుకోసిన దుండగులు
- పాతకక్షలే కారణమన్న ఎస్పీ
పెదగార్లపాడుకే చెందిన పురంశెట్టి అంకులు గతంలో నిషేధిత నక్సల్ సంస్థ జనశక్తిలో పనిచేశారు. అదే గ్రామానికి చెందిన చిన్నశంకరరావు, వెంకట కోటయ్య, వెంకటేశ్వరరెడ్డి కూడా గతంలో ఆయనతోపాటే పనిచేశారు. ఈ క్రమంలో అంకులుకు, వీరికి మధ్య విభేదాలు పొడసూపాయి. మరోవైపు, 30ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నా తనకు సరిగా జీతం ఇవ్వడం లేదని అంకులుపై చిన్న కోటేశ్వరరావు కోపం పెంచుకున్నాడు.
శత్రువులందరూ చేతులు కలిపి అంకులును హతమార్చేందుకు ప్లాన్ రచించారు. పథకంలో భాగంగా చిన్న శంకరరావు తన బంధువులైన అంకారావు, రమేశ్లను పిలిపించాడు. జనశక్తిలో పనిచేసి ఉండడంతో ఆ సంస్థకు సంబంధించి కొత్త నియామకాల గురించి మాట్లాడుకుందామని, వెంటనే గ్రామంలో ఉన్న తన అపార్ట్మెంట్ వద్దకు రావాలని అంకులుకు కబురుపెట్టారు. వెళ్లిన అంకులుకు తొలుత మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించారు. ఆయన మగతలోకి జారుకున్న వెంటనే తువ్వాలుతో గొంతు బిగించి, కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారని ఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు.