Washington: రేపే బైడెన్ ప్రమాణస్వీకారం.. దాడుల ముప్పుతో అప్రమత్తమైన అమెరికా యంత్రాంగం

  • భద్రతా సిబ్బంది నుంచే ముప్పు ఉందని సమాచారం
  • వైట్‌హౌస్ పరిసరాల్లో వేలాదిమందితో భద్రత
  • భద్రతా సిబ్బందిని కూడా తనిఖీ చేస్తున్న సిబ్బంది
  • డేగ కళ్లతో పహారా కాస్తున్న రక్షణ శాఖ
Joe Biden taken oath tomorrow huge security at white house

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆయన మద్దతుదారులు విపరీత పోకడలకు పోతున్నారు. దాడులతో తెగబడుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. జో బైడెన్ విజయం సాధించినప్పటి నుంచి దేశం అట్టుడికిపోతోంది.

ఈ నేపథ్యంలో రేపు బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రతా సిబ్బందిలో కొందరు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. శ్వేతసౌధం పరిసరాలు సహా వాషింగ్టన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా సిబ్బందిని మోహరించారు.

 విధుల్లో పాల్గొనే భద్రత సిబ్బంది నుంచే దాడుల ముప్పు ఉందన్న ముందస్తు హెచ్చరికలతో రక్షణశాఖ అధికారులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. బైడెన్ ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రతలో పాల్గొనే సిబ్బందిలో కొందరు తిరుగుబాటు చేసి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అలాగే, ట్రంప్ మద్దతుదారులు కూడా హింసకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఇటీవల కేపిటల్ భవనంపై జరిగిన దాడిలో కొందరు పోలీసులు కూడా పాల్గొనడంతో వైట్‌హౌస్ పరిసరాల్లో పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేల మంది నేషనల్ గార్డులను వాషింగ్టన్‌లో మోహరించారు. అలాగే, వేలాదిమంది స్థానిక పోలీసులు విధుల్లో ఉన్నారు. అయితే, విపరీత భావజాలంతో వీరిలో ఎవరైనా దాడులకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

అనుమానం వస్తే రెండు మూడుసార్లు తనిఖీ చేయాలన్న ఆదేశాలు కూడా అందాయి. ఒక్క వాషింగ్టన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చిన్నచిన్న గుంపులుగా వచ్చి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడి చేసే అవకాశం ఉండడంతో వారిని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వేరీ తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ట్రంప్ మద్దతుదారుల ఆందోళన కొనసాగుతోంది.

More Telugu News