India: పూణె ఎయిర్ పోర్టు బిజీ... వ్యాక్సిన్ రవాణా నేడో, రేపో మొదలు!

  • పూణెలో సిద్ధంగా ఉన్న విమానాలు
  • కేంద్రం ఆదేశిస్తే వెంటనే టేకాఫ్
  • ఇంకా ప్రభుత్వం చెప్పలేదంటున్న సీరమ్
  • ధర విషయంలో తొలగని సందిగ్ధత
Pune Airport Ready to Transport Vaccine

ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్ ను భారీఎత్తున ఉత్పత్తి చేస్తున్న పూణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేడు లేదా రేపటి నుంచి వ్యాక్సిన్ రవాణాను ప్రారంభించనుంది. మరో మూడు నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం అనంతరం, కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి వ్యాక్సిన్ ను రవాణా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

"ప్రస్తుతానికి కేంద్రం నుంచి గానీ, సీరమ్ నుంచి గానీ తమకు వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించాలని ఆదేశాలు రాలేదని చెబుతూనే, తొలి దశలో 70 నుంచి 80 శాతం టీకా వయల్స్ ను వాయు మార్గం ద్వారానే పంపనున్నాం. కొద్ది మొత్తం రోడ్డు రవాణా ద్వారానూ జరుగుతుంది" అని ముంబై కేంద్రంగా పనిచేస్తూ, వ్యాక్సిన్ రవాణా కాంట్రాక్టును పొందిన కూల్ ఎక్స్ కోల్డ్ చెయిన్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ అగర్వాల్ వెల్లడించారు.

కాగా, పూణెలోని సీరమ్ ల్యాబ్ లో దాదాపు వారం రోజుల నుంచి వ్యాక్సిన్ వయల్స్ సిద్ధంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీని మొదలు పెట్టాలని కేంద్రం ఆలోచనలో ఉండగా, ఇంతవరకూ ధరపై ఓ నిర్ణయానికి రాలేదన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ను సకాలంలో అన్ని ప్రాంతాలకూ చేర్చాలంటే, కనీసం రేపైనా సరఫరా ప్రారంభించాల్సి వుంటుందని ఈ సందర్భంగా అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, గత వారం చివరలో ఎయిర్ లైన్స్ కంపెనీల ప్రతినిధులు సీరమ్ వర్గాలతో సమావేశమై, రవాణాపై చర్చించారు. అతి శీతల పరిస్థితులను విమానాల్లో ఉంచేలా చూస్తూ, రవాణా విమానాలను పుణె నుంచి న్యూఢిల్లీ, కోల్ కతా, చెన్నై తదితర ప్రాంతాలకు చేర్చడంపై ఉన్న సవాళ్లను చర్చించారు. ఆపై మేజర్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాల నుంచి మారుమూల జిల్లాల్లో ఏర్పాట్లు చేసిన మినీ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలకు, ఆపై అన్ని ఆరోగ్య కేంద్రాలకు చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, కేంద్ర ప్రభుత్వంతో ఇంకా డీల్ కుదరనందునే వ్యాక్సిన్ సరఫరా ఆలస్యం అవుతోందని నిన్న సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News